
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్క్రాంతి సూచించారు. మంగళవారం ఆమె సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో టీజీఐఐసీ చైర్పర్సన్నిర్మల జగ్గారెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి భూ సమస్య ఉన్నా ఈ సదస్సుల్లో అప్లై చేసుకోవాలన్నారు.
ఈ నెల 3 నుంచి 20 వరకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల చుట్టం అని అన్నారు. సీఎం మాట ప్రకారం అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. వ్యక్తికి ఆధార్ భూమికి భూధార్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి ఖాసిం బేగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకులపై ఆర్థిక భారం పడదు
రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు 90 శాతం సబ్సిడీ ప్రభుత్వమే భరిస్తుందని బ్యాంకులపై ఎటువంటి ఆర్థిక భారం పడదని కలెక్టర్ క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్యాంకర్లు సకాలంలో రుణాలను అందించి లక్ష్యాలను సాధించాలని సూచించారు. మహిళా సంఘాలకు డ్వాక్రా రుణాలతో పాటు పర్సనల్ రుణాలు కూడా మంజూరు చేయాలన్నారు.
2024 -25 ఆర్థిక సంవత్సరానికి రుణ లక్ష్యాలను సాధించి జిల్లా ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎల్డీఎం నరసింహారావు, డీఆర్డీఏ పీడీ జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, ఎస్టీ గిరిజన సంక్షేమ అధికారి అఖిలేశ్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, మెప్మా పీడీ గీత, బ్యాంకర్లు , అధికారులు పాల్గొన్నారు.